విజయవాడ, జనవరి 13 : తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కోడిపందాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని జాయింట్ సీపీ రమణకుమార్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కంకిపాడు మండలం ఈడ్పుగల్లులో కోడిపందేలు నిర్వహించకుండా పోలీస్ పికెట్లు ఏర్పాట్లు చేశారు. దీంతో ధ్వజమెత్తిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సంప్రదాయ క్రీడలను ఎలా అడ్డుకుంటారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన బరికి సమీపంలో అనుచరులతో మంతనాలు నిర్వహిస్తున్నారు. కాగా, కొందరు ముగ్గుల పోటీల పేరుతో కోడిపందేల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాగే, సీసీ కెమెరాల ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటామని జాయింట్ సీపీ వెల్లడించారు.