న్యూ ఢిల్లీ, నవంబర్ 2: యువతను బాగా ఆకట్టుకుంటున్న ఫోన్ లలో ‘రెడ్ మీ’ ఫోన్ ముందుందనడంలో అతిశయోక్తి లేదు. మార్కెట్లో ‘రెడ్ మీ’ ఫోన్ల అమ్మకాలు దూసుకెళ్తున్నాయి. ఈ నేపధ్యంలో చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమి భారతీయ మార్కెట్లో సెల్ఫీ సిరీస్ ఫోన్ ను విడుదల చేసింది. ప్రత్యేకంగా ఢిల్లీలో ఓ కార్యక్రమం నిర్వహించి రెడ్ మీ వై1, రెడ్ మీ వై1 లైట్, పేర్లతో ఆవిష్కరించారు. రెడ్ మీ వై1 మొబైల్ 3జీబీ ర్యామ్/32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధరను రూ.8,999గా, 4జీబీ/64జీబీ వేరియంట్ ధరను రూ.10,999గా కంపెనీ నిర్ణయించింది. అలాగే 2జీబీ ర్యామ్, 16జీబీ అంతర్గత స్టోరేజితో వస్తున్న వై1 లైట్ మొబైల్ ధరను రూ.6,999గా ప్రకటించింది. ఈ రెండు ఫోన్ల అమ్మకాలు అమెజాన్ ఇండియా, ఎంఐ.కామ్లలో ఈ నెల 8 నుంచి ప్రారంభం కానున్నాయి.