టెహ్రాన్, జూన్ 7 : నేడు టెహ్రాన్లో జరుగుతున్న వరుస దాడులకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థ బాధ్యత తీసుకుంది. ఇరాక్ పార్లమెంట్, అయాతుల్లా ఖొమెయినీ సమాధి భవనంలోకి ఉగ్రవాదులు చొరబడ్డారు. ఈ క్రమంలో ఆత్మాహుతి పేలుళ్లకు పాల్పడ్డారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు మొత్తం ఎనిమిది మంది ఈ దాడుల్లో మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కొన్నేళ్ల తర్వాత ఇరాన్లో ఒక భారీ ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు ఐసిస్కు చెందిన వార్తా సంస్థ అమాక్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఈ విషయాన్ని స్థానిక వార్తాసంస్థలు పేర్కొన్నాయి. ముష్కరుల్లో ఒకరిని తాజాగా ఇరాన్ భద్రతా దళాలు అరెస్టు చేశాయి. మరొకరిని కాల్చివేయగా.. ఇంకొకరు తనను తాను కాల్చివేసుకున్నాడు. ఇరాన్ స్పీకర్ : ఉగ్రదాడిని ఒక చిన్న సంఘటనగా ఇరాన్ స్పీకర్ అల్ లార్జానీ అభివర్ణించారు. ఒక పక్క పార్లమెంట్ ప్రారంభ సెషన్ జరుగుతుండగానే ఈ ఉగ్రదాడి చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదులు ఇరాన్కు సమస్యలు ఉత్పన్నం చేయాలనుకుంటున్నారు. కానీ ఇరాన్ ఉగ్రదాడులను ఎదుర్కొవడంలో చాలా చురుగ్గా ఉంటుంది. వారి ఆశలు నెరవేరవు అని అన్నారు. మూడు దాడులకు ప్రణాళిక : ఇరాన్లో మొత్తం మూడు ఉగ్రదాడులు చేయాలనే ప్రణాళికతో ముష్కరులు వచ్చినట్లు ఇరాన్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటిలిజెన్స్ తెలిపింది. కానీ వీటిల్లో ఒక దాడి జరగక ముందే ముష్కరుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు పేర్కొంది. మిగిలిన రెండూ పార్లమెంట్, అయాతుల్లా ఖొమెయినీ సమాధి వద్ద చోటుచేసుకున్నట్లు పేర్కొంది. ఖొమెయినీ వద్ద జరిగిన దాడిలో ఒకరిని భద్రతా దళాలు కాల్చివేయగా.. మరొకరు తనను తాను కాల్చుకున్నారు.