ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ఇటీవలే ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి “వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం”లో కొన్ని కీలకమైన సవరణలు జరిగాయని సమాచారం. అయితే కుటుంబంలో ఎవరి పేరు మీదనైనా కూడా వాహనం ఉన్నప్పటికీ కూడా, ఆ వాహనం నడిపే డ్రైవర్ కి ఈ పథకం ప్రకారం ఏటా రూ.10వేలు అందుతాయని కొత్త సవరణ ద్వారా వెల్లడైంది. అయితే ఆ కుటుంబంలో లబ్దిదారుడి తండ్రి, తల్లి, కూతురు, తమ్ముడి ఇలా ఎవరి పేరు మీదనైనా సదరు వాహనం ఉన్నప్పటికీ కూడా ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించారు. కానీ బ్యాంకు అకౌంట్ మాత్రం లబ్ది దారుని పేరు మీదనే ఉండాలని నిబంధన విధించారు. అయితే ఈ విషయాన్నీ గ్రామ వాలంటీర్ లేదా వార్డు వాలంటీర్, పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్ ధ్రువీకరించాలి.
ఇకపోతే ఈ పథక సవరణలతో పాటే గతంలో దరఖాస్తులు తిరస్కరణలకు గురైన వారికి కూడా ఇది మరొక అవకాశంగా చెప్పుకోవచ్చు. కాగా అర్హులైన వారు మల్లి దరఖాస్తు చేసుకోవచ్చు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాకుండా దరఖాస్తులు ఆన్ లైన్లో అప్ లోడ్ చేసేందుకు గడువు అక్టోబర్ 31 వరకూ ప్రభుత్వం పొడిగించింది. కాగా అర్హులైనవారందరికీ కూడా నవంబర్ 8 కల్లా దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తి చేసి, 15 వరకు వారి ఖాతాల్లో నగదు జమ చేయనున్నారని సమాచారం.