కశ్మీర్ ప్రజలకు శుభవార్త!!

SMTV Desk 2019-09-13 13:04:43  

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌లో విధించిన ఆంక్షలన్నింటినీ తొలగిస్తూ, ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ మేరకు సమాచార, పౌర సంబంధాల అధికారుల నుంచి ఓ ప్రకటన వెలువడింది. రాష్ట్రంలోని ల్యాండ్‌లైన్ ఫోన్లను పూర్తి వినియోగంలోకి తెచ్చామని, అత్యంత సున్నితమైన కుప్వారా, హంద్వారా తదితర ప్రాంతాల్లోనూ మొబైల్ ఫోన్ నెట్‌ వర్క్‌ లను అందుబాటులోకి తెచ్చామని పేర్కొంది. ట్రాఫిక్ రద్దీ క్రమంగా పెరుగుతోందని, వెల్లడించింది. మొబైల్ ఫోన్ల వాడకం కూడా పెరిగిందని ఓ అధికారి వెల్లడించారు.

రాష్ట్రంలో ప్రశాంత వాతావరణ పరిస్థితి నెలకొంటే, ఆంక్షలను తొలగిస్తామని ఇటీవల జాతీయ భద్రదా సలహాదారు అజిత్ దోవల్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్కడా అల్లర్లు జరగకపోవడంతో, తొలుత కర్ఫ్యూను తొలగించిన అధికారులు, ఇప్పుడు ఫోన్ నెట్ వర్క్ నూ అందుబాటులోకి తెచ్చారు. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ మాత్రం అమలులో ఉంది. విధుల్లో ఉన్న సైనిక బలగాలను సైతం క్రమంగా వెనక్కు తీసుకుంటున్నామని రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.