ప్రజలు ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు పడుతున్నప్పుడు చేయూత అందించడానికి సినీ పరిశ్రమకు ఎప్పుడూ ముందుంటుంది... అని చెప్పడానికి చెన్నై ప్రజలకు హీరో మంచు మనోజ్ వ్యక్తిగతంగా సహాయక చర్యల్లో పాల్గొంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. హూదూద్, చెన్నై వరదల సమయంలో తగు రీతిలో స్పందించిన తెలుగు ప్రజలు మరోసారి స్పందించాలని కోరారు మంచు మనోజ్. ముఖ్యంగా తమిళనాడులోని ప్రజలు తాగునీరు కోసం ఇబ్బందులు పడుతున్నారు. చెన్నై నగరంలో అయితే నీటి ఎద్దడి విపరీతంగా ఉంది.
ఈ నేపథ్యంలో... "తెలుగు ప్రజలకు తిండి, నీరు, ఆవాసం అవసరమైన సమయంలో తమిళ సోదరులు వెంటనే తగు రీతిలో స్పందించారు. ఇప్పుడు మన వంతు వచ్చింది. మన ఇండియాలోనే 6వ మహానగరం అయిన చెన్నై నీరు లేకుండా ఇబ్బంది పడుతోంది. నా స్నేహితులు, శ్రేయోభిలాషుల సహకారంతో చెన్నైలో నేను పెరిగిన, తిరిగిన ప్రాంతాల్లో తాగునీరుని అందిస్తున్నాను. మీ అందరూ మీ వంతుగా సహాయం చేయాలని కోరుతున్నాను" అని స్పందించారు మంచు మనోజ్.