టాంటన్: బుధవారం పాకిస్తాన్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో ఆసిస్ 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్లు ఆడిన ఆసిస్ మూడు మ్యాచ్ లో విజయం సాధించగా భారత్ తో జరిగిన మ్యాచ్ తో పరాజయ పాలైంది. ఇక పాకిస్తాన్ నాలుగు మ్యాచ్ లు ఆడి కేవలం ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించగా, ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది. ఈ ఓటమితో పాకిస్థాన్ నాకౌట్ అవకాశాలు మరింత క్లిష్టంగా మారాయి. కాగా, పాక్పై గెలుపుతో ఆస్ట్రేలియా మరోసారి రెండో స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాక్ బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌటైంది. స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ (107) శతకంతో ఆసీస్ను ఆదుకున్నాడు. పాకిస్థాన్ జట్టులో మహ్మద్ అమిర్ ఐదు వికెట్లు తీసి ప్రత్యర్థి ఇన్నింగ్స్ను కుప్పకూల్చాడు. తర్వాత బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ 45.4 ఓవర్లలో కేవలం 266 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా బౌలర్లు సమష్టిగా రాణించి జట్టును గెలిపించారు.