వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తనకు మంత్రి పదవి వస్తుందని ఎమ్మెల్యే రోజా చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే సామాజిక సమీకరణాలో మరేమిటో తెలీదు కానీ కేబినెట్లో ఆమెకు చోటు దక్కలేదు. దీంతో ఆమె అలకబూనినట్లు వార్తలు గుప్పుమన్నాయి. దానికి తోడు అమరావతిలో జరిగిన కొత్త మంత్రుల స్వీకారోత్సవానికి రోజా హాజరుకాలేదు సరికదా ఆనాటి నుండి పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. విషయం తెలుసుకున్న సీఎం జగన్ నిన్న రోజాను క్యాంప్ ఆఫీస్కు రావాల్సిందిగా కబురు పంపారు. ఈ నేపథ్యంలో నిన్న అమరావతికి వచ్చిన రోజా సీఎం జగన్ను కలిశారు. దీంతో వీరిద్దరి భేటీ పది నిముషాల పాటే జరిగినా రోజా అలక నేపధ్యంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఇది ఇలా ఉండగా ఎమ్మెల్యే రోజాకు మంత్రి పదవికి బదులుగా నామినెటెడ్ పదవి ఇచ్చే యోచనలో జగన్ ఉన్నారని ఇప్పటి వరకు ప్రచారం జరిగింది. ప్రచారాన్ని నిజం చేస్తూ ఆమెకు జగన్ తీపి కబురు అందించారట. ప్రభుత్వంలో ఏదోక కీలక పదవి ఇస్తానని చెప్పిన జగన్, ఆమెకి కార్పొరేషన్లలో కీలకమైన ఏపీఐసీసీ ఛైర్ పర్సన్ పదవి ఇచ్చారని సమాచారం. నిజానికి నామినేటెడ్ పదవుల్లోనే ఇది టాప్ అని చెప్పవచ్చు. పరిశ్రమలకు భూముల కేటాయింపు దగ్గర్నుంచి మౌలిక సదుపాయాల వరకూ వివిధ సందర్భాల్లో ఏపీఐఐసీ కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకాక ఈ పదవికి ప్రోటోకాల్ ఉంటుంది, మంత్రులతో సమన స్థాయి కలిగిన పదవి కావడంతో ఆమె జాక్ పాట్ కొట్టినట్టే అని చెబుతున్నారు.