ప్రపంచకప్ టోర్నీ ప్రారంభం నుండి వర్షం ఆటంకం కలిగిస్తూనే ఉంది. ఈ వర్షం కారణంగా ఇప్పటికే మూడు మ్యాచ్ లు నిలిచిపోయాయి. అయితే భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నాటింగ్హామ్ వేదికగా గురువారం జరగాల్సిన మ్యాచ్కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ వారం మొత్తం నాటింగ్హామ్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నాటింగ్హమ్లో వర్షాలు కురుస్తుండటంతో టీమిండియా ప్రాక్టీస్కు చేయడానికి కూడా వీల్లేకుండా పోయింది. వరుసగా రెండు రోజులపాటు టీమిండియా ప్రాక్టీస్కు దూరమైంది. బుధవారం రాత్రి వరకు నాటింగ్హామ్లో భారీ వర్షాలు కురుస్తాయని.. గురువారం మధ్యాహ్నం వరకు జల్లులు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షం వల్ల మ్యాచ్ రద్దు కాకపోయినప్పటికీ.. అంతరాయం కలగడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.