న్యూఢిల్లీ: టాప్ టెన్ కంపెనీల్లో ఆరు కంపెనీల మార్కెట్ విలువ(ఎంక్యాప్) గత వారం రూ.99,994 కోట్లు లాభానికి పెరిగింది. అయితే వీటిలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) అత్యధికంగా లాభపడింది. ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్యుఎల్, హెచ్డిఎఫ్సి, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్లు కూడా మార్కెట్ విలువను పెంచుకోగా, మిగతా సంస్థలు ఐటిసి, ఎస్బిఐ, ఐసిఐసిఐ బ్యాంక్ వంటివి నష్టపోయాయి. మార్కెట్ విలువ పరంగా టిసిఎస్ అత్యధికంగా రూ.55,235 కోట్లు లాభపడి మొత్తం విలువ రూ.8,24,342 కోట్లకు చేరింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంక్యాప్ రూ.14,333 కోట్లు పెరిగి రూ.6,60,795 కోట్లు నమోదు చేసింది. ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ విలువ కూడా రూ.11,970 కోట్లు పెరిగి రూ.3,21,924 కోట్లు అయింది. హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ హెచ్డిఎఫ్సి మార్కెట్ విలువ రూ.9,538 కోట్లు పెరిగి రూ.3,75,774 కోట్లు కాగా, హిందుస్తాన్ యునిలీవర్ విలువ రూ.7,799 కోట్లు పెరిగి రూ.3,86,449 కోట్లు అయింది.