రెక్కలు తెగి, మూలన పడ్డ జెట్ ఎయిర్వేస్కు, ఆ సంస్థ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ రూ.250 కోట్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. జెట్ను పునరుద్ధరించడానికి అన్ని విధాల ప్రయత్నిస్తోన్న ఈ క్రమంలో బోర్డు నుంచి తప్పుకున్న గోయల్ నుంచి నిధులు రావడం విశేషం. జెట్ తక్షణ అవసరాల కోసం గోయల్ ఈ నిధులను ఇస్తున్నారు. ప్రస్తుతం జెట్ ఎయిర్వేస్ బ్యాంక్ల ఆధీనంలో ఉంది. జెటైర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఫండ్స్ను జెట్ ఎయిర్వేస్లో ఇన్వెస్ట్ చేస్తానని గోయల్ చెప్పారు. సోమవారమే జెట్ ఎయిర్ ఉద్యోగులకు గోయల్ లేఖ రాశారు. జెటైర్ ఈ ఎయిర్లైన్కు రూ.250 కోట్లు ఇవ్వడానికి అంగీకరించింది. జనవరి 14న జరిగిన వాటాదారుల అసాధారణ సమావేశంలో ఈ పెట్టుబడులపై నిర్ణయం తీసుకుంది. ‘బోర్డులోని మా స్థానాల నుంచి తప్పుకున్నప్పటి నుంచి, అనితాకు, నాకు జెట్లో ఎలాంటి పాత్ర లేదు. జెట్ ఎయిర్వేస్ ఫ్యామిలీ ప్రయోజనాల కోసం సాధ్యమైన ప్రతి త్యాగాన్ని చేశాం’ అని గోయల్ ఆ లేఖలో చెప్పారు.
గోయల్, భార్య అనిత జెట్ బోర్డు నుంచి ఏప్రిల్లో తప్పుకున్నారు. గోయల్ చైర్మన్ పదవి కూడా వదులుకున్నారు. జనవరి నుంచి జెట్ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడం లేదు. ఉద్యోగులు తమ జీతాల కోసం ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నారు. తమ గోడును పట్టించుకోవాలంటూ రాష్ట్రపతికి, ప్రధానికి కూడా లేఖలు రాశారు. జెట్ ఎయిర్వేస్ సేవలు ఏప్రిల్ 17 నుంచి మూత పడ్డాయి. దీని మూతతో దేశీయ ఏవియేషన్ మార్కెట్లో విమానాల కొరత ఏర్పడింది. టిక్కెట్ ధరలు పెరిగాయి. మరోవైపు జెట్ను పునరుద్ధరించడానికి బిడ్డింగ్ ప్రాసెస్ నడుస్తోంది. పొటెన్షియల్ ఇన్వెస్టర్లు తమ బిడ్స్ను దాఖలు చేయడానికి శుక్రవారం వరకు సమయం ఉంది. జూన్ క్వార్టర్ కల్లా జెట్ కొత్త ఇన్వెస్టర్ ఎవరో బ్యాంక్ల కన్సార్టియం ధృవీకరించనుంది.