సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల సమయం మరింత దగ్గరకు రావడంతో ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగుతున్నారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయ వేడిని మరింత హీటెక్కిస్తున్నారు. ఇకపోతే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని టార్గెట్ గా చేసుకుని ప్రధాని నరేంద్రమోదీ విమర్శలకు దిగుతున్నారు.
రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు యుద్ధనౌక ఐఎన్ఎస్ విరాట్ను గాంధీ కుటుంబం సొంత ట్యాక్సీలా వాడుకుందంటూ మోదీ విమర్శించారు. మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రమ్య స్పందించారు. ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు.
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కెనడా పౌరసత్వ వివాదాన్ని ప్రస్తావించారు. నరేంద్ర మోదీ కెనడా పౌరుడైన అక్షయ్కుమార్ను ఐఎన్ఎస్ సుమిత్రలో విహారానికి తీసుకువెళ్లారు. ఇది సరైందేనా? అంటూ నిలదీశారు.
ఈ వివాదం గురించి గతంలో వచ్చిన ఆర్టికల్ చూడండి అంటూ ఓ వార్తకు సంబంధించిన లింక్ను తన ట్వీట్కు జత చేశారు రమ్య. ఐఎన్ఎస్ విరాట్లో ప్రయాణించిన సమయంలో రాజీవ్ గాంధీతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా ఇద్దరు అధికారులు మాత్రమే వారి వెంట ఉన్నారని రిటైర్డ్ వైస్ అడ్మిరల్ వినోద్ పస్రిచా స్పష్టం చేశారు.
ఇకపోతే రమ్య ట్వీట్కు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ-2016కు అక్షయ్, కంగనాలను అప్పటి రాష్ట్రపతి, రక్షణ మంత్రి ఆహ్వానించారు. వారిని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించారు.
ప్రధాని మోదీ కూడా ఒక అతిథిలాగే వెళ్లారు అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అవును ఏ పార్టీ నాయకులైనా, ప్రధానులైనా సరే విదేశీ పౌరులను ఇలా మన యుద్ధనౌకల్లో ప్రయాణించేందుకు వీలు కల్పించడం సరికాదంటూ మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు.