ఓ వ్యక్తి తనకు రావాల్సిన రూ.35 రూపాయల కోసం రెండేళ్ల పాటు పోరాటం చేసి ఎట్టకేలకు విజయాన్ని సాధించారు. అయితే రూ.35కు బదులుగా రూ.33 మాత్రమే సంపాదించుకోగలిగారు. ఎవరా వ్యక్తి.. కేవలం రూ.35 కోసం ఎందుకు పోరాటం చేశారో తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. రాజస్థాన్లోని కోటాకు చెందిన సుజీత్ స్వామి ఓ ఇంజనీర్. ఆయన 2017 జూలై 2న ఢిల్లీకి వెళ్లాలనుకున్నారు.
ఇందుకోసం దాదాపు రెండు నెలల ముందుగా టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే వెయిటింగ్ లిస్ట్ భారీగా ఉండటంతో కొద్దిరోజుల ముందు సుజీత్ తన టికెట్ రద్దు చేసుకున్నారు. కానీ టికెట్ రద్దు అయిన తర్వాత సుజీత్కు పూర్తి మద్ధతు రాలేదు.. రూ.100 తగ్గించి, రూ..665 రీఫండ్ చేశారు.
రైల్వేశాఖ నిబంధనల ప్రకారం సాధారణంగా వెయిటింగ్ జాబితాలో ఉన్న టికెట్ను రద్దు చేసుకుంటే రూ.65 ఛార్జ్ చేసి మిగిలిన మొత్తాన్ని రీఫండ్ చేస్తారు. అయితే తన నుంచి రూ. 65 ఛార్జ్ చేయడంతో సుజీత్ రైల్వేశాఖను సంప్రదించారు.
అదే ఏడాది జీఎస్టీ అమల్లోకి రావడంతో మిగతా రూ.35 సర్వీస్ ట్యాక్స్ కింద ఛార్జ్ చేసినట్లు రైల్వేశాఖ తెలిపింది. అయితే తాను జీఎస్టీ అమల్లోకి రావడానికి ముందే టికెట్ను రద్దు చేసుకున్నానని... తన రూ. 35 తనకు ఇవ్వాలని ఐఆర్సీటీసీని కోరారు.
అయితే రైల్వే వర్గల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో 2018 ఏప్రిల్లో లోక్ అదాలత్ను ఆశ్రయించారు. ఇక్కడ కూడా తన సమస్య పరిష్కారం కాకపోవడంతో సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు.
ఈ విధంగా సుమారు రెండేళ్ల పాటు సుజీత్ రైల్వేశాఖతో పోరాటం చేశారు. ఈ క్రమంలో మే 1న ఆయన పోరాటానికి ఫలితం దక్కింది.. రూ. 33ను ఐఆర్సీటీసీ జమ చేసింది.. ఇన్నాళ్లపాటు తనకు రావాల్సిన సొమ్మును ఇవ్వకపోవడంతో పాటు రూ.2 తగ్గించి ఇవ్వడంతో సుజీత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తాను మళ్లీ పోరాడుతానని ఆయన తెలిపారు.