మాడ్రిడ్: మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో రెండో సీడ్ రఫెల్ నాదల్ (స్పెయిన్), నాలుగో సీడ్ రోజర్ ఫెదరర్ లు రెండో రౌండ్లో విజయం సాధించారు. దీంతో ఏడో సీడ్ జువాన్ మార్టిన్ డెల్పొట్రొ (అర్జెంటీనా) ఇంటిదారి పట్టాడు. అలాగే 8వ సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), పదో సీడ్ ఫాబియో ఫొగ్నిని (ఇటలీ) రెండో రౌండ్లో జయకేతనం ఎగుర వేశారు. అగ్రశ్రేణి ఆటగాడు నాదల్ రెండో రౌండ్లో పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో నాదల్ 63, 63తో ఫెలిక్స్ అగర్ (కెనడా)ను చిత్తు చేశాడు. ప్రారంభం నుంచే చెలరేగి ఆడిన నాదల్ ఏదశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. ఆఖరి వరకు జోరును కొనసాగిస్తూ అలవోక విజయాన్ని సొంతం చేసుకున్నాడు. మరో పోటీలో నాలుగో సీడ్ ఫెదరర్ కూడా అలవోక విజయం సాధించాడు. ఫ్రాన్స్ ఆటగాడు రిచర్డ్ గాస్కెట్తో జరిగిన పోరులో రోజర్ 62, 62తో జయభేరి మోగించాడు. మరోవైపు ఏడో సీడ్ డెల్పొట్రో మాత్రం ఓటమి పాలై టోర్నీ నుంచి వైదొలిగాడు. సెర్బియా ఆటగాడు లాస్లొడెరెతో జరిగిన పోరులో డెల్పొట్రో ఓటమి చవిచూశాడు. మూడు సెట్ల సమరంలో లాస్లొడెరె 36, 62, 75తో విజయం సాధించాడు.