ఇంగ్లాండ్: మే 30న ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభం కానున్న వరల్డ్ కప్ కోసం అన్ని దేశాల జట్లు సిద్దం అయ్యాయి. ఈ టోర్నీలో మొత్తం 10 దేశాలు తలపడనున్నాయి. ఈ టోర్నీకి ఇంకా మూడు వారాలే మిగిలి ఉండడంతో ఆయా జట్లు జెర్సీలను ఆవిష్కరించే పనిలో పడ్డాయి. బంగ్లాదేశ్ తన కొత్త జెర్సీని ప్రకటించగా, తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా తమ జెర్సీని ఆవిష్కరించింది. ఐతే లంక వైవిధ్యంగా సముద్రంలోని ప్లాస్టిక్ వ్యర్ధాలతో తయారు చేసిన జెర్సీని తీసుకొచ్చింది. శ్రీలంక తయారు చేసిన పర్యావరణ జెర్సీ ..ప్రజల్లో పర్యావరణంపై ఆలోచనలు రేకెత్తించేలా చేస్తుంది. లంక బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రపంచ క్రికెట్ అభిమానులు అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రపంచకప్లో ఆడే లంక ఆటగాళ్లంతా ఈ జెర్సీనే వినియోగించనున్నారు.