తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి .. పగటి పూట బయటకి వెళ్ళడానికి భయపడుతున్నారు జనాలు.. అన్నిచోట్లా 40 డిగ్రీలకు పైనే ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఎండ నుంచి తప్పించుకునేందుకు జనమంతా కొబ్బరి బొండాలు, మజ్జిగతో పాటు మరిన్ని ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నారు. మరి నిత్యం వాడే వాహనాలకు కూడా ఎండ దెబ్బ తలుగుతుంది. వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.లేకపోతే ప్రమాదాలు సంభవిస్తాయని, అలాగే సాంకేతిక సమస్యలు కూడా తలెత్తుతాయని పేర్కొంటున్నారు నిపుణులు ..
వాహనాల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఎండాకాలంలో వాహనాల ఇంజిన్ ఆయిల్ త్వరగా వేడెక్కుతుంది. అందుకే సరైన సమయంలో ఇంజన్ ఆయిల్ మార్చుకోవాలి.
అలాగే బయటకు వెళితే మీ వాహనాన్ని నీడలో పార్క్ చేసుకోవాలి.
బైక్ పెట్రోల్ ట్యాంకుపై కవర్ ఉండేలా చూసుకోవాలి.
సాధారణ సీటు కవర్లు త్వరగా వేడెక్కుతాయి. ఇది మన ఆరోగ్యానికి కూడా హానికరం. వెల్వెట్, పోస్టు క్లాత్ వంటివి వాడటం మంచిది.
టైర్లు అరిగి ఉంటే మార్చుకోవాలి.
ట్యూబ్లకు పంక్చర్లు ఉంటే వేసవికాలంలో అవి మార్చుకోవాలి.
ఎండాకాలం ఇంజన్గార్డు తొలగించడం మంచిది. దూర ప్రయాణమైతే బస్సుల్లోనే వెళ్లడం మంచిది. ఒకవేళ వాహనం తీయాల్సి వస్తే.. మధ్యమధ్యలో ఆగడం మంచిది. ఇలా చేయడం వల్ల ఇంజన్ వేడి తగ్గుతుంది.
వేసవిలో ట్యాంకులో గ్యాస్ ఏర్పడవచ్చు. కాబట్టి రాత్రిపూట ఒకసారి ట్యాంకు మూత తీసి మళ్లీ పెట్టాలి. దాని వల్ల గ్యాస్ బయటకు పోయి ఆయిల్ సులువుగా ఇంజన్ లోకి వెళ్తుంది.
మధ్యాహ్నం ఎండలో ఎక్కువసేపు బండి నిలిపితే రంగు వెలసిపోతుంది.
చాలామంది పెట్రోలును నిండుగా పోయిస్తుంటారు. వేసవిలో పెట్రోలు వేడికి ఆవిరి అవుతుంది. మధ్యాహ్నం సమయంలో పెట్రోలు పోయించుకుకోకుండా ఉంటే మంచిది. కిరణాలు నేరుగా ట్యాంక్ను తాకడంతో ఆవిరయ్యే ప్రమాదం ఉంది.
మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ద్విచక్రవాహనంపై ప్రయాణం చేయకపోవడమే మంచిది.
ఉదయం 8 గంటలకు ముందు సాయంత్రం 6 గంటల తర్వాత పెట్రోలు పోయించుకుంటే మంచిది..
ఎండనుంచి బండిని కాపాడుకోడానికి సాధ్యమైనంతవరకు నీడపట్టున నిలపాలి.
వాహనం నడుపుతున్న సమయంలో తేడాగా అనిపిస్తే వెంటనే బండిని పక్కకు ఆపి విశ్రాంతి తీసుకోవాలి.
అతిగా ఎండలు ఉన్న సమయంలో డాంబర్ రోడ్లు కరిగిపోయే ప్రమాదం ఉంది. అయితే మధ్యాహ్న సమయంలో డ్రైవింగ్ కొంచెం జాగ్రత్తగా చేయాలి.