త్వరలో తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు జరుగనున్నాయి. అంతకంటే ముందుగా ఈ నెల 28వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. మంత్రివర్గ సమావేశంలో చర్చించవలసిన అంశాలకు సంబందించి వివరాలను పంపించవలసిందిగా ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్.కె.జోషి అన్ని శాఖలకు సోమవారం లేఖలు వ్రాశారు. మంత్రివర్గ సమావేశంలో రెవెన్యూశాఖ రద్దు లేదా సమగ్ర ప్రక్షాళనకు సంబందించి చర్చించి నిర్ణయం తీసుకొనున్నారు. పురపాలక చట్టాలు పెండింగ్ బిల్లులు, రైతుబంధు, ఆసరా పధకాల సాయం పెంపు, నిరుద్యోగభృతి, వివిద ప్రభుత్వ శాఖలలో ఖాళీల భర్తీ, శాసనసభ, మండలి సమావేశాల షెడ్యూల్ తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశం చర్చించి ఆమోదం తెలుపుతారు. వాటికి శాసనసభ, మండలి ఆమోదం పొందేందుకు ఈ నెల 29 నుంచి 31 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. జూన్ 2 రాష్ట్రావతరణ దినోత్సవం జరుపుకోబోతున్నందున అసెంబ్లీ సమావేశాలు చివరి రోజున సిఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీ, పెన్షన్ల పెంపు వంటి అంశాలపై అసెంబ్లీలో ప్రకటన చేసే అవకాశం ఉంది.