కృష్ణా : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గుడివాడలో టిడిపి అభ్యర్ధి అవినాష్కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గుడివాడలో ధర్మానికి, అధర్మానికి మధ్య పోటీ జరుగుతుందని, గుడివాడలో నాని భల్లాల దేవ ఐతే, అవినాష్ బాహుబలి లాంటి వాడని పేర్కొన్నారు. నానిని గుడివాడ నుంచి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఓటమి భయంతోనే అవినాష్పై నాని దుష్ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. టిడిపి అధికారంలోకి వస్తే గుడివాడను మరో కుప్పం లాగా తీర్చిదిద్దుతామని చెప్పారు. గుడివాడ అభివృద్ది నిరోధక శక్తిగా నాని మారాడని, మరోసారి చంద్రబాబు గురించి నోరుజారితే సరైన గుణపాఠం చెబుతామని బుద్ధా వెంకన్న హెచ్చరించారు.