బెంగుళూరు, మార్చ్ 22: సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగుళూరులోని మహాత్మాగాంధీ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ‘ మీడియా మరియు భావ ప్రకటన స్వేచ్ఛ’ అనే అంశంపై ప్రకాశ్ రాజ్ మాట్లాడారు. అయితే.. ఎలాంటి అనుమతి లేకుండా ఈ సమావేశంలో ప్రకాశ్ రాజ్.. ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఇలా చేయడం కోడ్ ని ఉల్లంఘించినట్లేనని పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎన్నికల అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరుకు ప్రకాశ్ రాజ్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. దీనిపై స్పందించిన ప్రకాశ్ రాజ్ తాను రాజకీయ సమావేశంలో పాల్గొనలేదు. మీడియా మరియు భావ ప్రకటన స్వేచ్ఛ అనే అంశంపై మాత్రమే మాట్లాడానని తెలిపారు. అంతేకాకుండా ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రాదని స్పష్టం చేశారు.