గుండెపోటుతో మంత్రి మృతి

SMTV Desk 2019-03-22 17:24:41  karnataka cs shivalli minister, heart attack

బెంగళూరు, మార్చ్ 22: కర్నాటక మున్సిపల్ శాఖ మంత్రి సిఎస్ శివల్లి (58) శుక్రవారం తీవ్ర గుండెపోటుతో మరణించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ధార్వాడ్‌లో ప్రజలతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో హుబ్బోల్లిలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. ధార్వాడ్‌లో భవనం కూలిన ప్రాంతంలో చేపట్టిన సహాయక చర్యలను గత మూడు రోజులుగా ఆయన పర్యవేక్షిస్తున్నారు. 1999లో శివల్లి తొలిసారిగా ఇండిపెండెంట్‌గా గెలిచారు. అనంతరం ఆయన కాంగ్రెస్‌లో చేరారు. 2013, 2018లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఇటీవల జరిగి కర్నాటక కేబినెట్ విస్తరణలో ఆయనకు మంత్రిగా అవకాశం వచ్చింది. శివల్లి మృతిపై సిఎం కుమారస్వామి, ఇతర సహచర మంత్రులు, కాంగ్రెస్ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.