దుబాయి, మార్చ్ 19: ఐసిసి వన్డే బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో నిలిచాడు. ఈ ర్యాంకింగ్స్ లో కోహ్లీ 890 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలువగా, భారత క్రికెటర్ రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ రాస్ టేలర్ 830 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరీస్లో 353 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన క్వింటన్ డికాక్ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లాండ్పై రెండు సెంచరీలు సహా 424 పరుగులు చేసిన విండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ 35స్థానాలు ఎగబాకి 41వ ర్యాంక్కి చేరుకున్నాడు. భారత్పై రెండు సెంచరీలు, ఒక అర్థ సెంచరీ సాధించిన ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కెరీర్లోనే 25వ స్థానానికి చేరుకున్నాడు. కేదార్జాదవ్ 11 స్థానాలను మెరుగుపర్చుకుని 24వ స్థానానికి చేరుకోగా…ఆస్ట్రేలియాకు చెందిన మార్కస్ స్టోయినిస్ 29వ స్థానానికి చేరుకున్నాడు. బౌలర్ల విషయానికొస్తే…డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బుమ్రా…774 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ రెండో స్థానంలో, రషీద్ ఖాన్ మూడో స్థానంలో ఉన్నారు. జట్ల ర్యాంకింగ్స్ను పరిశీలిస్తే…ఇంగ్లాండ్ 123 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. టీమిండియా (120పాయింట్లు) రెండో స్థానంలో ఉండగా…112 పాయింట్లతో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.