హైటెక్ సిటీ ఉద్యోగస్తులు ఎంతకాలంగానో ఎదురుచూస్తున్నే అమీర్పేట్-హైటెక్సిటీ మెట్రో సేవలు బుదవారం ఉదయం 9.15 గంటలకు గవర్నర్ నరసింహన్ ప్రారంభించనున్నారు. కానీ సాయంత్రం 4 గంటల తరువాతే ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ కారిడార్లో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, పెద్దమ్మ గుడి, మాదాపూర్ మెట్రో స్టేషన్లలో ఇంకా కొన్ని పనులు పూర్తికావలసి ఉన్నందున ఆ మూడు స్టేషన్లలోకి ప్రయాణికులను అనుమతించబోమని తెలిపారు. పనులు పూర్తయ్యేవరకు ఆ మూడు స్టేషన్లలో మెట్రో రైళ్ళు ఆగవని తెలిపారు. అయితే వీలైనంత త్వరలోనే ఆ మూడు స్టేషన్లు కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
అమీర్పేట్-హైటెక్సిటీ మెట్రో కారిడార్లో అనేక మలుపులు ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా కొన్ని రోజుల వరకు మెట్రో రైళ్లు కాస్త మెల్లగా ప్రయాణిస్తాయని, కనుక మిగిలిన కారిడార్లలో మాదిరిగా 6 నిమిషాలకు ఒక ట్రైన్ చొప్పున కాకుండా ఈ కారిడార్లో 9-12 నిమిషాలకు ఒకటి చొప్పున ప్రయాణిస్తాయని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. కనుక అమీర్పేట్-హైటెక్సిటీ కారిడార్లో మెట్రో సేవలను ఉపయోగించబోతున్న ప్రయాణికులు అందరూ ఈ విషయాలను గుర్తుంచుకొని తదనుగుణంగా ప్లాన్ చేసుకొని బయలుదేరితే మంచిది.