న్యూఢిల్లీ, మార్చ్ 19: టీంఇండియా బౌలర్ జస్ప్రీత్ సింగ్ బుమ్రాకు దాదాపు ప్రపంచ కప్ బెర్తు ఖరారైనట్ట్లే. కాని ఐపిఎల్ కారణంగా గాయాలపాలయ్యే అవకాశం వుండటంతో ఈసారి బుమ్రా ముంబై ఇండియన్స్ జట్టుకు దూరమయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై తాజాగా ముంబై జట్టు చీఫ్ కోచ్, శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్ధనే స్పందిస్తూ.... ముంబై ఇండియన్స్ జట్టులో కీలక బౌలర్ బుమ్రాను జట్టుకు దూరం చేయాలనుకోవడాన్ని తాను సమర్ధించబోనన్నారు. అంతేకాక ఆ విషయంపై భారత క్రికెటర్లు నిద్రలేకుండా ఆలోచిస్తూ బుర్రలు పాడు చేసుకోవడం మానుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో బుమ్రా ఈ ఐపిఎల్ ఆడతాడని జయవర్ధనె స్పష్టం చేశారు. అలాగే ప్రపంచ కప్ కోసం బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని తాము అనుకోవడం లేదని స్పష్టం చేశారు. తమ జట్టులో అతడు కీలకమైన ఆటగాడు. అతడి బౌలింగ్ యాక్షన్ వల్ల గాయాలపాలయ్యే అవకాశం వుందనడం ఉట్టి అపోహమాత్రమేనని కొట్టిపారేశారు. డెత్ ఓవర్లలో అటాకింగ్ బౌలింగ్ తో ప్రత్యర్థులను అద్భుతంగా అడ్డుకునే బుమ్రా ఖచ్చితంగా గేమ్ చేంజర్...అలాంటి ఆటగాడు ఐపిఎల్ తమ జట్టు తరపున ఆడటం తమకు అదనపు బలమన్నారు. ఈ ఐపిఎల్ లో కూడా బుమ్రా తన సత్తా చాటతాడని జయవర్ధనే అభిప్రాయపడ్డారు.