హైదరాబాద్, మార్చ్ 19: ఈ నెల 15న న్యూజిలాండ్ లోని రెండు మసీదుల్లో దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఆ దుండగుడు బ్రెంటన్ టారంట్ను కోర్టులో కూడా హాజరుపరిచారు. ఈ అంశంపై న్యూజిలాండ్ పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశమైంది. దేశాన్ని ఉద్ధేశించి ప్రధాని జెసిండా ఆర్డెన్ ప్రసంగించారు. ఉగ్ర దాడికి పాల్పడిన ఆ వ్యక్తి బీభత్సం సృష్టించాడని, అతను అనైతికంగా వ్యవహరించాడని, ఆ ఉగ్రవాది పేరును తాను ప్రస్తావించబోనని ప్రధాని జెసిండా తెలిపారు. ఉగ్రదాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి పేర్లను బయటకు చెప్పండి, కానీ ఆ దాడికి పాల్పడిన వ్యక్తి పేరును మాత్రం ఎవరూ ఉచ్చరించకూడదని ప్రధాని జెసిండా అన్నారు. అతనో ఉగ్రవాది, అతనో క్రిమినల్, అతనో తీవ్రవాది, కాని తాను మాట్లాడుతున్నపుడు మాత్రం అతనికి పేరుండదన్నారు. న్యూజిలాండ్ చట్టాల ప్రకారం ఆ ఉగ్రవాదిని కఠినంగా శిక్షిస్తామన్నారు.