విజయవాడ, మార్చ్ 17: ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ తన ఎన్నికల ప్రచార పర్వాన్ని ముమ్మరం చేసింది. ఈ తరుణంలో ఆదివారం విజయనగరం జిల్లాలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచార సభలో అపశృతి చోటుచేసుకుంది. వాహన శ్రేణిపై నిల్చొని ప్రసంగిస్తున్న జగన్ పక్కనే నిర్మించి ఉన్న ఓ పాత భవనం కూలింది. ఆ భవనంపై అంతకు ముందే జగన్ను చూసేందుకు ఓ 20 మంది ఉన్నారు. ఒక్కసారిగా ఆ భవనం కూలడంతో ఆ 20 మందిలో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. అంతేకాక, గాయపడ్డ వారిలో ఓ మహిళ చేయి విరిగినట్లు సమాచారం.