ఈజిప్టు, ఫిబ్రవరి 27: రాజధాని కైరాలోని ఓ రైల్వే స్టేషన్ లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో దాదాపు 20 మంది మృతి చెందగా 40మందికి గాయాలైనట్టు సమాచారం. వేగంగా వస్తున్న రైలు.. రైల్వేస్టేషన్ లోని ప్లాట్ ఫాంను ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. దీంతో.. ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. మంటల నుంచి తప్పించుకునేందుకు ప్రయాణికులు పరుగులు తీశారు. అయినప్పటికీ.. 20మంది దుర్మరణం చెందారు. మరో 40మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.