స్విట్జెర్లాండ్, ఫిబ్రవరి 26: ప్రపంచ కుబేరుల్లో ఒకరు, ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీ-శ్లోకా మెహతా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ స్విట్జెర్లాండ్ లోని సెయింట్ మోర్తిజ్ మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలో సినీ ప్రముఖులు రణ్బీర్ కపూర్,అలియా భట్, అర్జున్ కపూర్, మలైకా అరోరా, కరణ్ జోహార్, పింకీ రెడ్డి తదితరులు ఈ వేడుకకు హాజరయినట్లు తెలుస్తోంది. మార్చి 9 న వీరిద్దరి వివాహం ముంబైలో జరగనున్న విషయం తెలిసిందే. వేడుకల్లో భాగంగా కాబోయే వధూవరులు ఆకాశ్-శ్లోకా ఇద్దరు తెలుపురంగు గుర్రపు బండిలో వేదిక వద్దకు వచ్చారు. ఇదే బండిలో కాసేపు ఊరేగారు. ఈ వేడుకకు సుమారు 850 మంది అతిథులు పాల్గొన్నారని అంబానీ సన్నిహితులు తెలిపారు. అతిథుల సౌకర్యార్థం హోటల్ మోర్టిజ్లో 300కి పైగా అత్యంత విలాసవంతమైన గదులను మూడు వేదికలు బుక్ చేశారట. వినోదం కోసం అక్కడి లూనా పార్క్లో ప్రత్యేక వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
అయితే ఆకాశ్ అంబానీ - శ్లోకా మెహతా బ్యాచిలర్ పార్టీకి సంబంధించిన ఫొటోలు, కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముకేశ్ అంబానీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, అగ్రశ్రేణి బాలీవుడ్ ప్రముఖులు ఈ పార్టీకి హాజరైన అతిథుల్లో ఉన్నారు. వీరంతా ఈ లగ్జరీ అల్పైన్ రిసార్ట్ సూట్కు వచ్చేందుకు ఉబేర్ లగ్జరీ ప్రైవేట్ జెట్ విమానాలను బుక్ చేసుకున్నారని సమాచారం. స్థానికులు సైతం ఈ వేడుకలను వీక్షించేందుకు అమితాసక్తి చూపినట్లు తెలుస్తోంది. వింటర్ వండర్లాండ్ థీమ్తో రూపుదిద్దుకున్న ఈ రిసార్ట్లో జరిగిన ఈ వేడుక స్థానికులను, ఇతర పర్యాటకులనూ ఆకర్షించింది.