అమరావతి, ఫిబ్రవరి 09: శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీజేపీ నేతలు సోము వీర్రాజు, మాధవ్లు మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై బీజేపీ, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇక్కడ ఉన్నది తెలుగు ద్వేషం ప్రభుత్వమని అభివర్ణిస్తూ ఒక ఫ్లెక్సీని ప్రదర్శించారు. తెలుగు భాష, సంస్కృతిని టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని వారు మండిపడ్డారు. నారా వారి పార్టీ తన ‘సన్’ రైజ్ కోసమే ఆలోచిస్తోందని, తెలుగు భాషాభివృద్ధికి మాత్రం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ధ్వజమెత్తారు. బడ్జెట్ సమావేశాలు అర్థాంతరంగా ముగిశాయని, ‘సేవ్ డెమొక్రసీ-సేవ్ ఆంధ్ర’ పేరుతో ఉద్యమం చేస్తామని బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఏపి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు ఏర్పాటు చేసిన తెలుగు విశ్వవిద్యాలయం దారుణమైన స్థితిలో ఉందన్న బీజేపీ నేతలు.. రాష్ట్రంలో కేంద్రం ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయాలను చూడాలని అన్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాలు నిరాశాజనకంగా ముగిశాయని, సభ్యులు మాట్లాడేందుకు అవకాశం కల్పించలేదని ఆరోపించారు. సీపీఎస్పై తమ వైఖరి ఏంటో ప్రభుత్వం స్పష్టం చేయకపోవడం దారుణమన్నారు.