కడప, ఫిబ్రవరి 8: ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా తీసుకువచ్చే బాధ్యత తనదని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం కడప మున్సిపల్ మైదానంలో జరిగిన ‘సమర శంఖారవం’ సభలో వైఎస్ జగన్ మాట్లాడారు. ఏపీకి హోదా ఇవ్వకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోసం చేశారని జగన్ ధ్వజమెత్తారు. గతంలో జరిగిన తిరుపతి సభలో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై జగన్ విమర్శలు చేసారు. ఇంతకాలం పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీలతో కలిసి తిరిగారని, నాలుగేళ్లు వారంతా కలిసి పనిచేశారని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చే బాధ్యత తనదని, ఒకవేళ చంద్రబాబు చేయకపోయినా.. తాను చేస్తానని చెప్పి పవన్ మోసం చేశారని అన్నారు. ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను నమ్మవద్దని హితవు పలికారు. కాగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ 25ఎంపీ సీట్లు గెలుచుకుంటే.. హోదా మనమే సాధించుకోవచ్చని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడం లేదని చెప్పారు. అయితే తాను సీఎం కావడం ఖాయమని జగన్ అన్నారు.