హైదరాబాద్, ఫిబ్రవరి 07: విభిన్న చిత్రాలు తీస్తూ మెల్లగా స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లోకెక్కిన యువ దర్శకుడు మారుతి. అయితే గతేడాది వచ్చిన శైలజ రెడ్డి అల్లుడు అనే సినిమా అనుకున్న వసూళ్లు రాబట్టకపోవడంతో కాస్త గ్యాప్ తీసుకున్నాడు ఈ డైరెక్టర్. కాగా గత కొద్ది రోజులుగా ఈ దర్శకుడు ఏ హీరోతో సినిమా చేయాలనే డైలమాలో ఉన్నట్లు సమాచారం. మంచి టాలెంట్ ఉంది, అంతకు మించి పరిచయాలు, మెగా క్యాంప్ అండ ఉండి కూడా తన తదుపరి చిత్రం మొదలు పెట్టలేకపోతున్నాడు. శైలజారెడ్డి చిత్రం రిలీజ్ కు ముందు అల్లు అర్జున్ , రామ్, గోపీచంద్ లకు కథలు చెప్పి ఓకే చేయించుకున్న మారుతి. కాని ఆ తర్వాత వారిలో ఎవరితోనూ సినిమా మొదలెట్టలేక పోయాడు. ఆ హీరోల నుంచి సరైన రెస్పాన్స్ లేకో ,నిర్మాతలు ఉత్సాహం చూపకో కాదట వాళ్లలో ఎవరూ కొత్త సినిమా సైన్ చేసేటంత ఖాళీగా లేకపోవటమే కారణం అని చెప్తున్నారు.
అయితే శైలజా రెడ్డి హిట్ అయితే ఖచ్చితంగా ఎవరో ఒకరు డేట్స్ ఎడ్జెస్ట్ చేసుకుని సినిమా మొదలు పెట్టేవారు. కానీ నాగచైతన్యతో చేసిన ఈ సినిమా భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. దాంతో ఇప్పుడు మారుతి అందరూ కొత్త వారితో ఓ చిన్న సినిమా మొదలెడదామా అనే ఆలోచనలో ఉన్నాడట. మహేష్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో సినిమా చేయటం ఈజీ అవుతుందేమో కానీ నాని, శర్వానంద్, నాగచైతన్య వంటి వారితో సినిమా అంటే అసలు డేట్స్ దొరకటం లేదంటున్నారు. మరి మారుతి హీరోలు చుట్టూ తిరగటం ఆపి తిరిగి తన పాత రోజుల్లోకి వెళ్లే అవకాసం ఉందన్నమాట.