టెలికం రంగంలో విధ్వంసక మార్పులు సృష్టించిన ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో మరో సారి కొత్త ఫీచర్ తో స్మార్ట్ ఫోన్ ని టుకురానుంది. మొదట్లో జియో ఫోన్ పేరుతో ఫీచర్ల ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి, బడ్జెట్ ధరలో సామాన్యులకు మొబైల్ సేవలను మరింత దగ్గర చేసింది. తద్వారా ఫీచర్ఫోన్ మార్కెట్ను కొల్లగొట్టింది. ఇపుడు స్మార్ట్ ఫీచర్లతో అందుబాటు ధరలో స్మార్ట్ఫోన్ తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో జియో ఫోన్ 3 పై అంచనాలు మార్కెట్లో హాట్ టాపిక్గా నిలిచాయి. మరికొన్ని నెలల్లో రిలయన్స్ వార్షిక సమావేశం జరగనున్న నేపథ్యంలో జియోఫోన్ 3 ఆవిష్కరణపై పలు ఊహాగానాలు హల్చల్ చేస్తున్నాయి.
5 అంగుళాల టచ్ స్క్రీన్తో, పవర్ఫుల్ సాఫ్ట్వేర్ సహాయంతో చాలా స్మార్ట్గా జియో ఫోన్ 3ని ఆవిష్కరించనుంది. ఆండ్రాయిడ్ గో ఆధారితంగా 2జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ సామర్ధ్యంతో ఈ స్మార్ట్ఫోన్ను తీసుకు రానుందట. అంతేకాదు 5 ఎంపీ బ్యాక్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరాను పొందుపరచినట్టు తెలుస్తోంది. ఇక జియో ఫోన్ 3 ధర విషయానికి వస్తే రూ. 4500 అందించనుందని అంచనా. ఈ ఏడాది జూన్లో జరిగే రిలయన్స్ జియో వార్షిక సమావేశంలో జియో ఫోన్ 3 స్మార్ట్గా వినియోగదారులను పలకరించనుంది.