హైదరాబాద్, ఫిబ్రవరి 2: ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా బయోపిక్ లో నటించాడానికి సిద్దం అవుతున్నాడని సమాచారం. తమిళ ప్రముఖ నటుడు జేపీ చంద్రబాబు జీవితాధారంగా తీస్తున్న సినిమాలో ప్రభుదేవా చంద్రబాబు పాత్రలో నటిస్తునాడని సినీ వర్గాల్లో టాక్. 1950-60 నాటి కాలం లో చంద్రబాబు తన ఆటా, పాటా తన నటనతో తమిళ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తూ ఉండేవాడు. ఆ కాలంలో అతను సినిమాలో కనిపిస్తే చాలు ఆ సినిమా దాదాపు హిట్టే అని అనేవారు. అయితే అలాంటి నటుడి జీవిత కథని ఇప్పుడు తెరపైకి తీసుకురాబోతున్నారు. అప్పట్లో శభాష్ మీనా సినిమాలో పాపులర్ నటుడు శివాజీగణేషన్ కంటే వొక్కరూపాయి రెన్యుమరేషన్ ఎక్కువ తీసుకుని సంచలనం సృష్టించిన చంద్రబాబు 47 ఏళ్లకే మరణించారు.
ఆయనకు అప్పట్లోనే చెన్నైలోని ఆర్.ఎ.పురంలో కళ్లు బైర్లుకమ్మే స్థాయిలో ఓ పెద్ద బంగ్లా కూడా వుండేది. అతను ఆ బంగ్లాలోని తొలి అంతస్తు వరకు కారు నడుపుకుంటూ వెళ్లే వారని తమిళ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే అతను తాగుడుకు బానిస అయి చివరికి తన ఆస్తి పాస్తులు అన్నిటిని కోల్పోయి దీనావస్థకు చేరి చనిపోయారట. అలాంటి వ్యక్తి జీవిత కథ ఆసక్తికరంగా వుంటుందని భావించి ప్రభుదేవా అందులో నటిస్తున్నట్లు తెలిసింది.