హైదరాబాద్, జనవరి 30: మల్టీ స్టారర్ సినిమా అంటే ముందు గుర్తొచ్చే హీరో దగ్గుబాటి వెంకటేష్. ఏ హీరోతోనైనా స్క్రీన్ షేర్ చేసుకుంటాడు వెంకీ మామ. అయితే ఈ మధ్యే వరుణ్ తేజ్ తో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మల్టీ స్టారర్ సినిమా ఎఫ్2 ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వెంకీ మామ ఇప్పుడు మరో మల్టీ స్టారర్ కు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. జైలవకుశ వంటి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న దర్శకుడు కెఏస్.రవీంద్ర తెరకెక్కించనున్న వెంకీ మామ సినిమాలో నాగ చైతన్యతో కలిసి వెంకీ అల్లరి చేయబోతున్నాడు.
అయితే ఈ సినిమాలో మాస్ అంశాలు కూడా బాగానే ఉంటాయని సమాచారం. ఇకపోతే వెంకీ - నాగ చైతన్యలతో పాటు ఈ సినిమాలో మరో దగ్గుబాటి హీరో కూడా నటించనున్నట్లు సమాచారం. రానా కొన్ని నిమిషాల పాటు అతిధి పాత్రలో కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ ఇదే ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకుంటోంది. సురేష్ బాబు ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ - హుమా ఖురేషి కథానాయికలుగా నటిస్తున్నారు.