అమరావతి, జనవరి 22: గత ఆదివారం వైసీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తన పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే అనంతరం రాధ కృష్ణా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. నిన్న జరిగిన కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కృష్ణాజిల్లా నేతలతో సమావేశమై రాధను పార్టీలోకి తీసుకుంటున్నట్లు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. పార్టీ ప్రయోజనాల కోసమే రాధను తెలుగుదేశంలోకి ఆహ్వానిస్తున్నామని ఆయనను కలుపుకుని వెళ్లాలని నేతలకు సూచించారని, ఈ నెల 25న రాధాకృష్ణ చంద్రబాబు సమక్షంలో పచ్చజెండా కప్పుకుంటారని టీడీపీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి.
వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం భవిష్యత్ కార్యాచరణ, పార్టీ మార్పు అంశాలపై రాధాకృష్ణ రాధా-రంగా మిత్రమండలి సభ్యులతో సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీలో చేరడమే మంచిదన్న అభిప్రాయం కార్యకర్తలు, అనుచరుల నుంచి వ్యక్తం కావడంతో టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాధాకృష్ణ టీడీపీలో చేరుతారా లేదంటే ఇదంతా కేవలం ప్రచారమా అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.