మాల్ధా, జనవరి 22: భాజపా అధ్యక్షుడు అమిత్ షా పశ్చిమ బెంగాల్లో నిర్వహించిన ర్యాలీపై నెలకొన్న వివాదం కొనసాగుతూనే ఉంది. అయితే, మొదట మాల్దా ఎయిర్పోర్ట్ హెలిప్యాడ్లో అమిత్ షా విమానం ల్యాండయ్యేందుకు మమత ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో బీజేపీ తృణమూల్ సర్కార్పై విరుచుకుపడింది. అమిత్ షా విమానం ల్యాండయ్యేందుకు మాల్ధా జిల్లాలోని గోల్డెన్ పార్క్ హోటల్తో పాటు బీఎస్ఎఫ్ ఉపయోగించే హెలిప్యాడ్లో అనుమతించడంతో బీజేపీ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి.
విమాన ల్యాండింగ్ సమస్య పరిష్కారం అయ్యింది అనుకుంటే తాజాగా ర్యాలీ నేపథ్యంలో తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ర్యాలీ కోసం తాము ఏర్పాటు చేసిన కటౌట్లను, పోస్టర్లను పలు చోట్ల అధికార పార్టీ కార్యకర్తలు ధ్వంసం చేస్తున్నారని బీజేపీ బెంగాల్ రాష్ట్ర శాఖ చీఫ్ దిలీప్ ఘోష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ర్యాలీకి హాజరయ్యేందుకు వస్తున్న బీజేపీ కార్యకర్తలను తృణమూల్ కార్యకర్తలు అడ్డుకుని దాడులు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై పోలీస్ కేసులు నమోదు చేస్తాం అని హెచ్చరించారు.