మోడీ 'చాయ్ వాలా'... పుకారేనా...?

SMTV Desk 2019-01-22 18:19:16  Indian Prime minister, Narendramodi, Vishwa hindhu parishath Former President, Praveen thogadia

న్యూ ఢిల్లీ, జనవరి 22: భారత ప్రధాని నరేంద్ర మోడీతో గత 43 ఏళ్లుగా పరిచయం ఉంది కాని తానెప్పుడూ చాయ్ అమ్ముకోవడం నేను చూడలేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు వీహెచ్‌పీ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా. నరేంద్ర మోడీ తాను రైల్వేస్టేషన్‌లో చాయ్ అమ్మానని.. తనను తాను చాయ్ వాలాగా 2014 ఎన్నికల ముందు అభివర్ణించుకున్నారు. ఇప్పటికీ ఆయన చాయ్ వాలానని చెప్పుకుంటుంటారు. అయితే ఈ విషయాన్ని వీహెచ్‌పీ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా కొట్టిపారేశారు. ఇదంతా మోడీ ఎన్నికల జిమ్మిక్ అని చెబుతున్నారు. తనకు మోడీతో 43 ఏళ్లుగా పరిచయం ఉందని అప్పటి నుంచి ఏనాడూ మోడీ చాయ్ అమ్మడం చూడలేదని స్పష్టం చేస్తున్నారు. ఆయన ఎన్నికల్లో ఓటర్ల సానుభూతిని పొందడానికి మాత్రమే అలా చెప్పుకున్నారని తొగాడియా అంటున్నారు.





వచ్చే నెల 9న వొక కొత్త పార్టీని ప్రకటించబోతున్నానని ఈ పార్టీ హిందువుల కోసమే పని చేస్తుందని తొగాడియా చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో మా పార్టీ గెలిచిన మరుసటి రోజు అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ప్రారంభిస్తామని తొగాడియా స్పష్టం చేశారు. రామాలయంపై ఆర్డినెన్స్ తేకపోవడం నరేంద్ర మోడీ వైఫల్యమేనని ఆయన విమర్శించారు. ట్రిపుల్ తలాక్ చట్టం కోసం రేయింబవళ్లు పని చేసిన మోడీ రామాలయ నిర్మాణాన్ని మాత్రం పట్టించుకోకపోవడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని తొగాడియా ఆరోపించారు.