జనవరి 22: తెలుగులో వచ్చిన బోల్డ్ మూవీ అర్జున్ రెడ్డి .. ఈ చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన నటి షాలిని పాండే. అర్జున్ రెడ్డి సినిమా హిట్ అయినప్పటికీ షాలిని పాండే కి సరైన అవకాశాలు రాలేదు. అదే తనతో కలిసి నటించిన విజయ్ దేవరాకొండ కొత్త కొత్త సినిమాలతో దూసుకుపోతున్నాడు. షాలిని మాత్రం అలనాటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి లో చిన్న పాత్రల్లో నటించింది. కానీ మహానటి చేసినప్పటికీ మంచి గుర్తింపు రాలేదు. ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న 118 సినిమాలో వొక హీరోయిన్ గా షాలిని నటిస్తోంది. తాజాగా ఈ బ్యూటీకి బాలీవుడ్ లో మంచి ఆఫర్ వచ్చినట్లు వినికిడి. ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ కుమారుడు ఆదిత్యని హీరోగా పరిచయం చేస్తూ భాంఫాడ్ అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా షాలిని పాండేని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను అనురాగ్ కశ్యప్ నిర్మిస్తుండడంతో అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా ద్వారా రంజన్ చందేల్ అనే వ్యక్తి నూతన దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. గతేడాదిలోనే సినిమా షూటింగ్ మొదలైనప్పటికీ సినిమాకు సంబంధించి ఎలాంటి న్యూస్ బయటకి రానివ్వలేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాతో షాలినికి బాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు వస్తుందని చెబుతున్నారు. సినిమా సక్సెస్ అయితే గనుక ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో సెటిల్ అయిపోవడం ఖాయం.