మహబూబాబాద్, జనవరి 22: తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం, రాజతండా మూడో వార్డు ఎన్నిక ఆశ్చర్యకరంగా సాగింది. ఇక్కడ పోటీ పడ్డ ఓ అభ్యర్థి, ఆదివారం నాడు మరణించగా, ఆ విషయం తెలిసికూడా వార్డు ఓటర్లు అతన్నే తమ వార్డు సభ్యుడిగా ఎన్నుకున్నారు. మూడో వార్డు ఎన్నికకు కాంగ్రెస్ మద్దతుదారుడు బానోతు భాస్కర్, టీఆర్ఎస్ మద్దతుదారుడు బీ శ్రీనివాస్ పోటీల్లో నిలిచారు. అనారోగ్యం కారణంగా బానోతు భాస్కర్ ఆదివారం నాడు మరణించారు. ఆయన మృతి వార్త తెలుసుని గ్రామ ప్రజలంతా తరలివచ్చారు. ఆ మరుసటి రోజున పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భాస్కర్ కు 44 ఓట్లు, ప్రత్యర్థి శ్రీనివాస్ కు 25 ఓట్లు వచ్చాయి. దీంతో మరణాన్ని జయించలేకపోయిన భాస్కర్, ఎన్నికల్లో మాత్రం విజయం సాధించినట్లయింది.