జైపూర్, జనవరి 20: రాజస్థాన్ రాష్ట్రంలో రాత్రి 8 గంటల తర్వాత మద్యం అమ్మకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. అనంతరం వాటికి సంబందించిన ఆదేశాలను సైతం స్పష్టంగా జారీ చేశారు. 8 గంటల తర్వాత కూడా మందు అమ్మితే వాళ్లపై భారీగా జరిమానాలు విధించండి. వాళ్ల షాపులు సీల్ చేసి, లైసెన్సులు రద్దు చేయండి అని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులను ఆదేశించారు. చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో సీనియర్ అధికారులతో సమావేశంలో గెహ్లాట్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
2008లోనూ అప్పటి మా ప్రభుత్వం ఇలాంటి విధానమే తీసుకొచ్చింది. రాత్రి 8 గంటల తర్వాత మద్యం అమ్మకపోవడం అన్నది సమాజానికి ఓ సానుకూల సందేశాన్ని ఇచ్చింది అని ఆయన చెప్పారు. ఇక మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు అమ్ముతున్నారన్న సమాచారంతో అలాంటి వాళ్లపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక రాష్ట్రంలో మద్యం అక్రమ రవాణాను కూడా అరి కట్టాలని అధికారులకు అశోక్ గెహ్లాట్ స్పష్టం చేశారు.