లిబియ, జనవరి 20: మధ్యధరా సముద్రంలో వరుసుగా రెండు పడువలు మునిగిపోయాయి. ఈ ఘోర ప్రమాదంలో దాదాపు 170 మంది గల్లంతయ్యారు. లిబియాలో అంతర్యుద్ధం కారణంగా అక్కడి ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు యూరోప్ దేశాలకు వలస వెళుతున్నారు. మధ్యదరా సముద్రం గుండా వీరు ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలకు వెళుతున్నారు. పరిమితికి మించి జనాన్ని ఎక్కించుకోవడంతో అవి మునిగిపోతున్నాయి.
ఈ క్రమంలో శనివారం లిబియాలోని గారాబుల్లి రేవు నుంచి 120 మంది ప్రయాణికులతో బయలుదేరిన పడవ 10 గంటల ప్రయాణం తర్వాత సముద్రంలో మునిగిపోవడంతో అందులోని వారంతా గల్లంతయ్యారు. మరో పడవ మొరాకో నుంచి బయలుదేరి మధ్యదరా సముద్రానికి పశ్చిమాన ఆలబోరన్ సముద్రంలో మునిగిపోయింది. ఈ పడవలో 53 మంది ఉన్నారు. సముద్రంలో కొట్టుకుంటూ వచ్చిన ఓ వ్యక్తిని తీరప్రాంతంలో అధికారులు గుర్తించి కాపాడారు. వీరు బతికివుండే అవకాశాలు తక్కువేనని భావిస్తున్నారు. గల్లంతైన వారి కోసం ఇటలీ నావికాదళం గాలింపు చర్యలు చేపట్టింది.