వాషింగ్టన్, జనవరి 19: అమెరికాలో వలసదారులను అడ్డుకునేందుకు ట్రంప్ ప్రభుత్వం అమెరికా- మెక్సికో సరిహద్దు వెంబడి గోడ నిర్మాణానికి పూనుకుంది. కాగా ఈ గోడ నిర్మాణానికి నిధుల విషయమై ప్రతిపక్ష డెమోక్రాట్లతో వచ్చిన విభేదాల కారణంగా ప్రారంభమైన అమెరికా షట్డౌన్ 27వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో సుమారు 8 లక్షల మంది ఉద్యోగులకు జీతాలు అందడం లేదు. ముఖ్యంగా 6 వేల మంది సీక్రెట్ సర్వీసు ఉద్యోగుల పే చెక్కులు లేకుండా నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ సందర్బంగా తమ సిబ్బంది పట్ల అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ కృతఙ్ఞత చాటుకున్నారు. ఈ శుక్రవారం వారి కోసం తానే స్వయంగా పిజ్జాలు డెలివరీ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ విషయాన్నీ ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
బుష్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ‘వేతనం లేకుండా దేశం కోసం పనిచేస్తున్న సీక్రెట్ సర్వీస్ సిబ్బందికి, ఫెడరల్ ఉద్యోగులకు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే వారికి మద్దతుగా నిలుస్తున్న దేశ పౌరులకు కూడా ధన్యవాదాలన్నారు. రాజకీయాలను పక్కనబెట్టి ప్రభుత్వం, ప్రతిపక్ష నేతలు షట్డౌన్కు ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది అంటూ పోస్ట్ చేసారు. కాగా బుష్ పాలనా కాలంలో(2001- 2009) అమెరికాలో వొక్కసారి షట్డౌన్ కాకపోవడం విశేషం. అయితే1995-96లో బిల్ క్లింటన్ హయాంలో 21 రోజుల పాటు కొనసాగిన షట్డౌన్ రికార్డును ట్రంప్ ప్రభుత్వ 27 రోజుల షట్డౌన్ అధిగమించింది.