కోల్కత్తా,జనవరి 19: ‘‘దేశ ప్రధానిగా బీఎస్పీ అధినేత్రి మాయావతి లేదా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అయితే బాగుంటుంది అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సమాజ్వాదీ పార్టీ అధినేత, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు బెంగాల్లో మమత దీదీ నిర్వహించిన ర్యాలీకి అఖిలేష్ హాజరైన విషయం విదితమే. దీనిలో భాగంగా ప్రధాని అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుందని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు అఖిలేష్యాదవ్ ఈ విధంగా స్పందించారు. దేశంలో వున్న నేతల్లో మాయావతి, మమత బెనర్జీ ఇద్దరూ బలమైన నేతలని, థర్డ్ ఫ్రంట్ ని నడిపించగల శక్తి వారిలో ఉందని అన్నారు. ప్రధాని అభ్యర్థి ఎవరన్నది సమస్య కాదని, ప్రస్తుతం తమ ముందన్న లక్ష్యం బీజేపీని ఓడించడమేనని వ్యాఖ్యానించారు.
దేశంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో దేశానికి కొత్త ప్రధాని కావాలని, సరికొత్త నాయకత్వానికి తమ కూటమి నాందిపలుకుతుందని అఖిలేష్యాదవ్ పేర్కొన్నారు. యూపీలో కూటమి సందర్బంగా కాంగ్రెస్ను దూరంగా పెట్టిన అఖిలేష్, మాయావతిలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమదూరం పాటిస్తున్న విషయం తెలిసిందే.