న్యూఢిల్లీ, జనవరి 18: అయ్యప్ప స్వామి ఆలయంలోకి ప్రవేశించిన ఇద్దరు మహిళలు బిందు, కనకదుర్గలకు 24 / 7 రక్షణ కల్పించాలంటూ శుక్రవారం సుప్రీంకోర్టు కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమకు ప్రాణ హాని ఉంది.. రక్షణ కల్పించాలని కోరుతూ ఈ ఇద్దరు మహిళలు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటీషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు బిందు, కనకదుర్గలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు తీర్పు మేరకు బిందు, కనకదుర్గలు ఆలయంలోకి ప్రవేశించి అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. కానీ ఆలయంలోకి వెళ్లి వచ్చాక జనవరి 15న కనకదుర్గ మీద ఆమె అత్త, బంధువలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
ఈ క్రమంలో వారికి బెదిరింపులు ఎదురవుతూనే ఉన్నాయి. దాంతో వీరు ఇద్దరు తమకు ప్రాణ హాని ఉందని గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అలాగే ఆలయంలోకి వెళ్లాలనుకునే మహిళలకు పోలీసు రక్షణ కల్పించేలా కోర్టు ఆదేశించాలని పిటీషన్ లో కోరారు. వీరి పిటిషన్పై తక్షణ విచారణ చేపట్టాలని వీరి తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ను కోరారు.