విజయవాడ, జూలై 25 : పాదయాత్రల పేరుతో విధ్వంసానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని డీజీపీ సాంబశివరావు హెచ్చరించారు. గత సంవత్సరం జరిగిన ముద్రగడ పాదయాత్రల వల్ల రూ.60 కోట్ల నష్టం జరిగిందని, శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన స్పష్టంచేశారు. వ్యక్తులెవరైనా సంఘీభావం తెలిపితే ఫర్వాలేదు.. కానీ ఆ పేరుతో ఆస్తుల విధ్వంసానికి పాల్పడటం తగదన్నారు. చట్ట వ్యతిరేక పనుల్లో పాల్గొంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. ర్యాలీ చేయాలంటే పోలీసు అధికారుల హామీ తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బాధ్యత వహిస్తామని హామీ ఇస్తేనే అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఉపేక్షించే ప్రసక్తే లేదని డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు.