కేరళ, నవంబర్ 13: శబరిమల ఆలయ వివాదం సందర్భంగా అన్ని వయసులను మహిళలను గుడిలోకి అనుమతిస్తూ తాను ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని దాఖలైన 48 పిటిషన్ల విషయంలో సుప్రీం కోర్టు మంగళవారం సంచలన నిర్ణయం తీసుకుంది. వీటిపై బహిరంగ విచారణ జరుపుతామని, ప్రజలు తమ వాదన వినిపించవచ్చని ప్రకటించింది.
‘ప్రస్తుతం స్టే ఇవ్వడం సాధ్యం కాదు. కానీ మా తీర్పును పునస్సమీక్షిస్తాం. వీటిపై వచ్చే ఏడాది జనవరి 22 న బహిరంగ విచారణ జరుపుతాం. పిటిషనర్లు, ఈ కేసుతో సంబంధమున్నవారే కాకుండా సామాన్య ప్రజలు కూడా పాల్గొని వారి అభిప్రాయాలను తెలపొచ్చు.. ’ అని కోర్టు పేర్కొంది. బహిరంగ విచరణ సర్వోతన్నత న్యాయస్థానం చరిత్రలో చాలా అరుదుగా జరిగే విషయం. సంచలన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను ప్రజల మధ్యలో విచారణ జరపడం బహుశా ఇదే తొలిసారి. అయ్యప్ప గుడిలోకి 10 నుంచి 50 ఏళ్ల వయసు మధ్య ఉన్న మహిళలను ప్రవేశించకుండా అమలు చేసిన నిషేధాన్ని సుప్రీంకోర్టు ఇటీవల ఎత్తేయడం తెలిసిందే. దీంతో పలు హిందూ సంఘాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. రుతుక్రమ వయసులో ఉన్న మహిళలు వస్తే ఆలయం అపవిత్రం అవుతుందని వాదిస్తున్నాయి.