హైదరాబాద్, అక్టోబర్ 31: ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ నాలుగో విజయం సాధించింది. జోన్ బి లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 53-32తో పట్నా పైరేట్స్ను చిత్తు చేసింది. ట్యాక్లింగ్, రైడింగ్ లలో టైటాన్స్ ఆటగాళ్లు దూసుకెళ్లడంతో సునాయాస విజయాన్ని అందుకుంది. టైటాన్స్ స్టార్ రైడర్ రాహుల్ చౌదరి 17 రైడ్ పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక నీలేశ్ 7 పాయింట్లు చేసాడు. ట్యాక్లింగ్లో విశాల్ (9 పాయింట్లు) అదరగొట్టాడు. పట్నా తరఫున వికాస్ 9 రైడ్ పాయింట్లు సాధించాడు.
మంగళవారం జరిగిన మరో మ్యాచ్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 37-27తో పుణేరీ పల్టన్స్పై గెలుపొందింది. నితిన్ తోమర్, సచిన్ లు రాణించారు. ప్రొ కబడ్డీ సీజన్-6 లో నితిన్ తోమర్ 100 రైడ్ పాయింట్లు సాధించాడు. బుధవారం జరిగే మ్యాచ్ల్లో దబంగ్ ఢిల్లీతో పుణేరీ పల్టన్, పట్నా పైరేట్స్తో బెంగళూరు బుల్స్ తలపడనున్నాయి.