న్యూ ఢిల్లీ, అక్టోబర్ 31: భారత ప్రథమ ఉప ప్రధాని, హోంశాఖ మంత్రి సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన భారీ విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్, మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
182 మీటర్ల ఎత్తుగల ఈ విగ్రహం ప్రపంచంలో అతి ఎత్తైన విగ్రహంగా రికార్డుల కెక్కింది. .స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రాజెక్టులో ఫైవ్ స్టార్ హోటళ్లు, టెంట్ సిటీ, రోప్వే, వివిధ రాష్ర్టాల అతిథి గృహాల నిర్మాణం, ఉద్యానవనాలు, పటేల్ జీవిత విశేషాలతో మ్యూజియం ఏర్పాటు చేశారు. ఒక నది మధ్యలో ఇటువంటి ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఒక అసాధారణ కార్యమే.
ఈ విగ్రహం పాదాలను నేలపై మోపి.. మేఘాల్లోకి తలెత్తి.. తాను కలలుగన్న భారతావనిని పరికిస్తున్నట్లు ఉండే పటేల్ విగ్రహాన్ని కేవలం 36 నెలల కాలంలో నిర్మించారు. నిర్మాణ వేగం, నాణ్యత, భారీతనంతో కూడిన ఈ ప్రాజెక్టు ఇంజనీరింగ్ అద్భుతమే కాకుండా, దేశీయ సాంకేతికత స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పింది.