న్యూఢిల్లీ, జూలై 17 : నేడు జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చే ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ వెంట పెన్నులు తీసుకురావద్దని ఎన్నికల కమీషన్(ఈసీ) సూచించింది. ఓటు వేసేందుకు ప్రత్యేకంగా తయారు చేయించిన మార్కర్ను అందిస్తామని పేర్కొంది. మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ ప్రత్యేకంగా ఈ (మార్కర్) పెన్నులను తయారు చేసింది. మొదటి సారిగా పోలింగ్ కేంద్రాల వద్ద నిబంధనల పోస్టర్లను అంటిస్తున్నారు. ఎంపీలకు ఆకుపచ్చ రంగులో ఉండే బ్యాలెట్ పత్రాలు.. ఎమ్మెల్యేలకు గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలను అందిస్తున్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో రిటర్నింగ్ అధికారులకు సులభమవుతుందని ఇలా రంగు రంగుల బ్యాలెట్ పత్రాలను ఉపయోగిస్తున్నారు. మొత్తం 32 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒకటి పార్లమెంటు హౌస్లో ఉండగా.. అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో ఒక్కో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఓటింగ్ విధానాన్ని పరిశీలించేందుకు 33 మందిని ఈసీ నియమించింది. బ్యాలెట్ బాక్సులను జూలై 20న ఢిల్లీకి తీసుకురానున్నారు. సోమవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఎంపీలుగా ఉన్న ఉత్తర ప్రదేశ్, గోవా ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, మనోహర్ పారికర్ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.