విజయవాడ, జూలై 3 : కుటుంబ సభ్యులు తనని వేధిస్తున్నారని ఆ ఇబ్బందులు తట్టుకోలేక ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అంతకుముందు ఓ సెల్ఫీ వీడియో తీసి.. అందులో ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను వివరించారు. ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గురువారెడ్డి మంగళవారం ఉదయం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చనిపోవడానికి భార్య, అత్తమామలు, బావమరిది కారణమని చెప్పాడు. అర్ధాంతరంగా జీవితాన్ని ముగిస్తున్నందుకు క్షమించాలని తల్లిదండ్రులను వేడుకున్నాడు. అతని ఫోన్లో లభించిన సెల్ఫీ వీడియో ద్వారా ఆత్మహత్యకు కారణాలు తెలుసుకునేందు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే చేయని తప్పునకు రెండు రోజుల పాటు జైల్లో ఉంచడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు చెబుతున్నారు. రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.