విశాఖపట్నం, జూన్ 8 : నవ నిర్మాణ దీక్షల వల్ల ఉద్యోగులు కార్యాలయాల్లో ఉండకపోవడంతో ప్రజా సమస్యలు పట్టించుకునే నాథుడే కనిపించడం లేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఈ దీక్షల వల్ల రాష్ట్రంలో పాలన స్తంభించిందని ఆయన ధ్వజమెత్తారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నవ నిర్మాణ దీక్షల పేరు చెప్పి చంద్రబాబు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వీర్రాజు మండిపడ్డారు. " 2014లో భాజపా, జనసేన పార్టీల వల్లే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మోదీని ప్రధానిగా దేశ ప్రజలు నిర్ణయించారు. చంద్రబాబును ప్రధాని అభ్యర్థిగా ఎప్పుడూ ఎవరూ నిర్ణయించలేదు. కొడుకును ముఖ్యమంత్రి చేసి.. తాను ప్రధాని కావాలని చంద్రబాబు అనుకుంటున్నారు. రాష్ట్రంలో బీజేపీ గెలుపునకు టీడీపీ ఎన్నడూ సహకరించలేదు. చంద్రబాబు లాంటి కుట్రపూరిత మనస్తత్వం ఉన్న నాయకుడు దేశంలో ఇంకెవరూ లేరు" అని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.